Sunday, November 27, 2011

నా బాల్యం

అక్క  పేరు  దేవి అని ముందే చెప్పాను. అక్కకు మొదటి నుంచి చదువంటే పెద్దగా ఆసక్తి లేదు. కనుక తన చదువు 5 వ తరగతి తోనే ముగిసింది. ఈ విషయం నన్ను కూడా  కొద్దిగా   బాధించింది. ఇకపోతే చదువంటే నాకు పంచ ప్రాణాలు,  పుస్తకాల  పురుగు అనికూడా మరో పేరు వుండేది బడిలో. 


             నా  విద్యాభ్యాసం విజయవాడ ప్రక్కన ఏలూరులో ప్రారంభమయింది. బాల్యం కూడా అక్కడే గడిచింది. నా ఒకటవ తరగతి  టీచర్ పేరు 'పద్మావతి'. ఆమె పేరు, ఆమె మొహం కుడా నేనింకా మరిచి పోలేదు. ఎందుకంటే  ఆవిడ  ఇల్లు మా ఇంటి ప్రక్కనే ఉండేది  గనుక. 

                అన్నట్లు అమ్మానాన్న గురించి  చెప్పలేదు  కదు. వాళ్ళ పేర్లు పరిచయం చేశాను కాని  వాళ్ళ గురించి చెప్పనే లేదు. అమ్మ ఇంట్లోనే వుండేది. నాన్న ఇస్త్రీ పని. నేనెప్పుడు దాని కోసం బాధపడింది లేదు.  మాది ఒక మధ్య తరగతి కుటుంబం. 



                     చిన్నప్పుడు నేను చాలా  చలాకీగా ఉండేవాన్ని.ఎందుకో బంధువులు అందరూ మద్రాసులో ఉండటంతో మా  అమ్మానాన్న కూడా మద్రాసులో జీవించేందుకు సిద్ధపడ్డారు. దానితో నా చిన్నప్పుడే మద్రాసు ప్రయాణమయ్యాము.

                       నా ఎనిమిదవ  ఏట  అంటే 1997 సెప్టెంబర్ 5 న, ఎవరో మహానుభావురాలు  చనిపోయింది   అని అన్ని టివి లలోనూ చూపించసాగారు. ఆ చనిపోయిన వ్యక్తి  ఎవరో కాదు.  నేను నా జీవితంలో ఎంతగానో ఆరాధించే 'మదర్  తెరెసా' ఆమె. అప్పుడు నాకు ఊహ తెలియక ఆ విషయాన్ని ఆకతాయిగా వదిలేసాను.  ఇప్పుడు ఆ విషయం గుర్తుకు వచ్చిన ప్రతీసారి బాధనిపిస్తుంది.  

ఏలూరిలో బాల్యం

  ముందు మేము ఏలూరులో ఒక ముస్లిం వాళ్ల ఇంట్లో అద్దెకు ఉండేవాళ్లం. ఆ ప్రదేశం నాకు సరిగ్గా గుర్తు లేదు కాని అక్కడ బీడీలు చుట్టడం మాత్రమే వృత్తని మాత్రం తెలుసు. అప్పుడు అమ్మానాన్న అంబికా అగరబత్తుల వారి కంపెని వాళ్ల ఇంట్లో దోబిలుగా పని చేసేవారు. పనికి దూరం కావడంతో ఆ ఇల్లు ఖాళీ చేశారు. తరువాత అక్కడ జీతం పెంచకపోవడంతో అక్కడ పని మానేశారు.

అప్పుడు ఏలూరులోని పవర్ పేట అనే చోట్లో ఉండేవాళ్లం. మా ఇంటి ప్రక్క రాజు అనే వ్యక్తి ఇల్లు వుండేది.. నాకు తెలిసి అప్పటికి టి.వి ఉన్న ఇల్లు ఆ ప్రదేశంలో వాళ్లది మాత్రమే.అక్కా,నేను మాత్రమే కాదు చుట్టు ప్రక్కల ఉన్న పిల్లలంతా కూడా అక్కడే వుండేవాళ్లం సాయంత్రమైతే. అప్పటికి మాకు తెలిసింది ఈ టి.వి,దూరదర్శన్ మాత్రమే. చిన్నప్పుడు పిల్లతో సరదాగా సాయంత్రం బడి నుండి వచ్చిన వెంటనే ఆటలతో గడిపేవాణ్ణి.

ఒకసారి ఏమైందంటే నేను చిన్నప్పుడు నాన్న ఇస్తీ షాపు ప్రక్కన సాయంత్రం ఆడుకుంటున్నానంట. చీకటి పడడంతో అందరూ ఇంటికి తిరుగుముఖం పట్టారంట. ఒక్క నేను తప్ప. చీకటి పడుతుంది గనుక అమ్మ నాతో ఆడుతూ ఉన్న పిల్లలందర్ని అడిగిందంట మా అబ్బాయి ఏమైనా కనబడ్డడా అని. సమయం రాత్రి 10 కావచ్చిందంట. ఇంతలో అటు ప్రక్కన కలప, కట్టెలు అమ్మే ఒక షాపు ఉందంట..అది ఓపెన్ లో ఉండడంతో ఒకవేళ ఎందుకైనా మంచిదని అక్కడ వెదికి చూశారంట. అక్కడ పెద్ద దుక్కుల మధ్య పడుకొని ఉన్నానంట. అమ్మ భోరున విలపించిందంట ముందు కనబడకపోయేసరికి. అప్పుడప్పుడు అమ్మ ఇది చెప్పుతుంది నా బాల్యాన్ని గుర్తు చేస్తూ.


                 అలాగే మరొక చిన్న చిలిపి పని. చిన్నప్పుడు  ఒక చిన్న దొంగతనం  చేశాను..జీవితంలో అదే నా మొదటి మరియు చివరి దొంగతనం..అది ఏమిటంటే..అక్కను తీసుకు రమ్మని అమ్మ పక్కింటికి పంపింది. అప్పుడేమో వాళ్లింట్లో ఎవరు లేరు..వాళ్లింటి నిండా ఒక్క డబ్బాలో గోళీలు..నాకు గోళీలాడడమంటే ఇష్టం.కాని ఇంట్లో ఒప్పుకోరు.అందుకని కొన్ని గోళీలు నా ఫాంటు జోబిలో వేసుకొని పారిపోయాను. ఇప్పుడు అది తలచుకుంటే నాకు నవ్వనిపిస్తుంది. మరి చాలా తమాషాగా అనిపిస్తుంది నాకే ఈ విషయం. ఇవ్వని జరిగేటప్పుడు  నాకు ఒక 5 ఏళ్ల వయసు ఉంటుంది.నాకు తెలిసి 1997 లో అంటే నాకు ఒక 8 ఏళ్ల ప్రాయం ఉంటుంది. అప్పుడే మేము కుటుంబంతో మొత్తంగా ఊరు విడిచి చెన్నై పయనమయ్యాము.       

పాయకరావు పేటలో చిన్నప్పుడు

మా అమ్మ వాళ్ల అమ్మానాన్న పేరులు సూర్యాకాంతం, లక్ష్మణ స్వామి..నాన్న వాళ్ల అమ్మనాన్న పేర్లు పోలమ్మ, కోటయ్య. అమ్మ వాళ్ల కుటుంబం తునిలో ఉండేది..కొన్ని అనివార్య కారణాల వలన తాత ఇల్లు అమ్మి కూతుళ్ల పెళ్లిళ్లు  చేసేందుకని తరువాత పాయకరావు పేట లో స్థిరపడ్డారు. తాతకు మొత్తం నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. అమ్మ ఈంట్లో 5 వ సంతానం. నాన్న వాళ్ల తల్లిదండ్రుల ఊరు అన్నవరం ప్రక్కన ఉన్న చిన్నయ్య పాలెం. నాన్నకు ఇద్దరు అక్కలు, ఆయనే చివరి వాడు.అప్పట్లో మా నాన్నకు పెళ్లికని మూడువేల రూపాయల కట్నం ఇచ్చారంట..ఆప్పటి పరిస్థితులకు అది పెద్ద మొత్తమే మరి. చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలకు మనస్ఫర్ధలు.ఎప్పుడు గొడవలే.ఎందుకంటే నాన్న గొడవ మనిషి మరి.వాళ్ల కుటుంబం కూడా అంతే. అందుకే నాకు మా నాన్న తో సహా ఆ కుటుంబంలో వాళ్లు ఎవ్వరు నచ్చరు మరి.         


         నాకు బహుశా ఒక మూడేళ్ల ప్రాయం అనుకుంటాను.. మొదట్నుంచి అమ్మకి నాన్నకి నేను పుట్టక ముందు నుంచి గొడవలంట.. నాకు బాగా గుర్తు నేను మా అమ్మమ్మ వాళ్లింట్లో ఉంటుండగా మా నాన్న వచ్చి మా అమ్మను నీళ్లు మోసే కావిడ బద్దతో విపరీతంగా కొట్టాడు. అది నాకు ఊహ తెలియనప్పుడు జరిగినప్పటికిని ఆ సంభావం ఇంకా నాకు బాగా గుర్తు. అప్పుడు మా తాతయ్య మా అమ్మను పోచీకత్తుల తోటి అమ్మను నాన్నతోటి పంపారంట. నేను పుట్టినప్పుడు ఒకే వరదలంట పాయకరవు పేటలో. అందువలన ఊరి ప్రజలందరూ పాండురంగస్వామి వారి గుడిలో తలదచుకున్నారంట..వరద నీళ్లు గుడి గోపురాన్ని తాకాయంట..


పెళ్లయిన కొత్తలో అమ్మను నాన్న తీసుకువెళ్లిన తొలి సినిమా ' అన్వేషణ ' తరువాత  ' కాష్మోరా '. ఇందులోనే అర్ధం చేసుకోవచ్చు మా నాన్న అభిరుచి ఏమిటో. నాన్న కొన్నాళ్లు విశాఖపట్నంలోని టి.సుబ్బిరామి రెడ్డి కంపెనిలో ఏదో చిన్న పని సంపాదించారంట..తరువాత దేనికనో పని మానేసి మకాం ఏలూరికి మార్చారు. మొదటి నుండి మా నాన్నకు స్థిరత్వం ఉండేది కాదు. దానితో అమ్మ చాలా బాధ పడేది.